Kavitha | త్రినేత్ర.న్యూస్ : రాజకీయాల్లో మహిళలకు దక్కాల్సిన పదవులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. ఇందులో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ విషయంలో ఆ రోజే తాను కేసీఆర్ను ప్రశ్నించాను అని కవిత పేర్కొన్నారు. డెయిలీహంట్ పాడ్కాస్ట్లో కవిత మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం తప్పా..? దేశ చరిత్ర తిరగేసినా దేశం కోసం కొట్లాడిన మహిళలెవరికీ పెద్ద పదవులు రాలేదు. మహిళలు రాజకీయాల్లో ఉండడమే నేరమా..? అని కవిత ప్రశ్నించారు. 2025వ సంవత్సరం తనకు కలిసి రాలేదు. ఈ ఏడాది ఎన్నో కుట్రలు, కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్నాను. కానీ చివరకు తనపై కుట్రలు చేసే వాళ్లే గెలిచారు. అందుకే వాళ్లు ఇంకా పార్టీలో ఉన్నారు, తాను మాత్రం బయట ఉన్నాను. బీఆర్ఎస్లో ఓ వర్గం తనకు వ్యతిరేకంగా పని చేసింది. ఇప్పుడు కాదు 2019 నుంచే తనపై కుట్రలు చేసి ఓడించారు. తాను ఏ తప్పు చెయ్యలేదు, కాబట్టి ఎవరికీ భయపడను అని కవిత తేల్చిచెప్పారు. మా అన్న అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్ టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. నేను మాత్రం తన సొంతంగా 2006లో తెలంగాణ జాగృతి అనే సంస్థని ఏర్పాటు చేశాను. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్గానే పాల్గొన్నాను. అధికారం చేపట్టాక పార్టీలో ఉన్న కొందరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనను కార్నర్ చేస్తున్నారన్న అనుమానం తనకు అప్పుడే కలిగింది. తమ ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇచ్చింది. తన ఫోన్తో పాటు తన భర్త, ఇంట్లో పని చేసే వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని తనకు అప్పుడు అర్థమైందని కవిత పేర్కొన్నారు.