Harish Rao | త్రినేత్ర.న్యూస్ : పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 4 వేల మందికి పైగా గెలవడంతో.. సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై హరీశ్రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్లో పడింది. 25 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9:30 గంటలకు చిట్-చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదు. అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారంటే అది కేసీఆర్ పవర్ అని హరీశ్రావు తెలిపారు. రేవంత్ రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుంది.. అందాల పోటీలు, ఫుట్బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్లు పేదవాడికి అన్నం పెడతాయా? సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుంది. వాస్తు భయంతో సెక్రటేరియట్ మెట్లు ఎక్కడం లేదు. గేట్లు, తలుపులు మార్చినా భయం పోక కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్కే పరిమితం అయ్యారని హరీశ్రావు పేర్కొన్నారు. దమ్ముంటే కో ఆపరేటివ్ ఎన్నికలు జరపాలి.. 4,000 మందికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలవడంతో రేవంత్ రెడ్డికి ఓటమి భయం మొదలైంది. అందుకే కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారు. దమ్ముంటే కో ఆపరేటివ్ ఎన్నికలు జరపాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతాం ఓయూకు ఒంటరిగా వస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి.. వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనం. సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే పీపీటీని స్వాగతిస్తున్నాం. కానీ వాస్తవాలు చెప్పడానికి బీఆర్ఎస్కు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం మాకు ఇస్తూ మా గొంతు నొక్కుతున్నారు. మైకులు కట్ చేస్తున్నారు. అవకాశం ఇస్తే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతాం అని హరీశ్రావు తెలిపారు. ఇది ప్రభుత్వం కాదు.. ఒక కన్సల్టెన్సీ కంపెనీ.. ఇది ప్రభుత్వం కాదు.. ఒక కన్సల్టెన్సీ కంపెనీ. బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తోంది. అప్పులు ఇప్పించినందుకు ఒక బ్రోకర్ కంపెనీకి గతంలోనే రూ. 180 కోట్ల కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే బ్రోకర్ సలహాతో జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి రూ. 30 వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ. 7,000 కోట్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి పంచుకున్నారు. 20 శాతం కమిషన్ ఇచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నారని మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాంగ్రెస్ హయాంలో కృష్ణా జలాల్లో నీటి వాడకం కేవలం 28.49 శాతం మాత్రమే. తెలంగాణకు 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ రెడ్డి ఉత్తరం రాయడం చారిత్రక తప్పిదం. దానికి క్షమాపణ చెప్పి, వెంటనే 90 టీఎంసీల కోసం లేఖ రాయాలి. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్ అంటూ లీకులు ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట. ఈ సిట్ (SIT) ఒక పెద్ద జోక్. రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నాం. ఏపీలో అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది. రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా గుంజుకొస్తాం. ఉద్యమంలో నాపై 300 కేసులు ఉన్నాయి. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడం. డీజీపీ శివధర్ రెడ్డికి ఫుట్బాల్ మ్యాచ్ రక్షణకే సమయం సరిపోతోంది అని హరీశ్రావు ఎద్దెవా చేశారు. అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు.. సంగారెడ్డి జిల్లా సర్జాపూర్లో ఓటేయలేదని దళితులపై దాడులు చేసి ఇళ్లు కూలగొట్టినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదు. ఖాకీ పుస్తకం, చట్టం అందరికీ సమానంగా ఉండాలి. కానిస్టేబుళ్ల ఆరోగ్య భద్రతను రూ. లక్షకు కుదించడం దుర్మార్గం. వారి టీఏ, డీఏ అలవెన్స్లపై డీజీపీ దృష్టి పెట్టాలి. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ చేయలేదని యాదగిరిగుట్టలో వేడుకుంటే నాపై కేసు పెట్టారు. ఖమ్మం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే దాడులు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలి. రాష్ట్రం తెచ్చిన వాళ్లం, త్యాగాల చరిత్ర మాది. రేవంత్ రెడ్డి అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు అని హరీశ్రావు తేల్చిచెప్పారు.