Sridhar Babu | తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సెక్రటేరియెట్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీది హైప్ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్.. మాది హోప్ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్ అంటూ కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ హయాంలో చేసింది తక్కువ.. చెప్పుకుంది ఎక్కువ. మా హయాంలో చేసేది ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ. మీలాగా మాకు గాల్లో మేడలు కట్టడం రాదు. అరచేతిలో స్వర్గం చూపించడం అసలే రాదు. అబద్ధాల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. రాష్ట్రానికి పరిశ్రమలు రావొద్దు.. పెట్టుబడులు రావొద్దు. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దు. ఇదే బీఆర్ఎస్ పాలసీ.. అని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న దిగ్గజ కంపెనీలను కించపరచడం మంచిది కాదు.. ఒక సీనియర్ నాయకుడిగా మీకిది తగదు అని హితువు పలికారు. మీ హయాంలో ఏ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా మీ కుటుంబం అనుమతి తప్పనిసరి. మేము ఆ గేట్ పాస్ కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టాం. అందుకే ఈరోజు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కి తెలంగాణ బై చాయిస్ కాదు.. బై డెస్టినేషన్గా మారింది. అందుకే ఇవాళ పరిశ్రమలు తెలంగాణకు క్యూ కడుతున్నాయన్నారు. ఎక్కడో ఉండి పాలన సాగించిన మీకు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం ‘హైప్’ లాగే కనిపిస్తుంది. ఇది హైప్ కాదు... ఈ రాష్ట్రం కోసం... భావితరాల భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న ‘హోప్’. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మేం చేసుకున్న రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు అబద్ధమైతే, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు కూడా గ్లోబల్ సమ్మిట్ కు రావడం అబద్ధమా..? మీ హయాంలోనూ అనేక ఎంవోయూలు జరిగాయి. కానీ... అన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాయా? ఒక్కో ఎంవోయూ గ్రౌండింగ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అది తెలిసి కూడా రెండేళ్లలో రూ.3.4 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చిన మాపై విమర్శలు చేయడం సరికాదు. ప్రతి ఎంవోయూను గ్రౌండింగ్ చేసే మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి శ్రీకారం చుట్టాం. కానీ, మీరు మాత్రం ‘రియల్ ఎస్టేట్’ కోసమే అంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదు. మేం రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి అవసరాలకు అనుగుణంగా అన్ని ఒకే చోట ఉండాలనే గొప్ప సంకల్పంతో ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు రూపొందించాం. మీ హయాంలో ఓ అధికారి మంచి పాలసీని రూపొందించారని చెప్పారు.. బాగుంది. కానీ ఆ పాలసీలో ఉన్న నిబంధనలను మీరు అమలు చేశారా? ఉత్తమ ఆఫీసర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి, సెక్రటేరియట్కే వెళ్లకుండా పాలన సాగించిన చరిత్ర మీది. ఇవాళ అధికారులకు స్వేచ్ఛనిచ్చి రాష్ట్రాభివృద్ధిలో వాళ్లను భాగస్వామ్యం చేస్తోంది మేము అని మంత్రి స్పష్టం చేశారు. Sridhar Babu | వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఎందుకు పూర్తి చేయలేదు? ‘వరంగల్ టెక్స్ టైల్ పార్క్’ మీద పేటెంట్ మీదా? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు? ఒక ప్రణాళికా ప్రకారం మేము అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్ను పూర్తి చేశాం. అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చాం. దేశంలో ఇదే మొట్టమొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్. కేంద్రం నుంచి మా హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకొచ్చాం. వాస్తవాలు మాట్లాడితే.. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ లో పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఈ రంగాల్లో తెలంగాణ ఇప్పుడు టాప్ లో ఉందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎకో సిస్టం అభివృద్ధికి వేసిన పునాదులే కారణం. మీరు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులను రూ.54 వేల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మేం కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.2.43 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు తీసుకెళ్లాం. 2024–25 లో తలసరి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్ డీపీ) తలసరి ఆదాయం దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తేల్చింది. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.87 లక్షలు కాగా, కర్ణాటకలో రూ.3.8 లక్షలు, తమిళనాడులో రూ.3.61 లక్షలు, మహారాష్ట్రలో రూ.3.9 లక్షలుగా ఉందని మంత్రి అన్నారు. విమర్శలు చేసే ముందు ఒకసారి గతం కూడా చూసుకోండి. ఇది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం. ఇక్కడ పరదాలు లేవు, కేవలం ప్రగతి మాత్రమే ఉంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణను ప్రపంచ పటంలో నంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా నిలబెడతాం. ఇందులో రాజీ పడబోం అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.